Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా నమ్మకమైన నాయకుడిగా, ‘జగిత్యాల పులి’గా పేరుగాంచిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే సంగతి అందరికీ తెలిసిందే.
మలుపు తిరిగిన జగిత్యాల భేటీ
నిన్న జగిత్యాలలో పర్యటించిన కేటీఆర్, అనంతరం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడే గంటల తరబడి ఏకాంతంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల గురించి మాట్లాడారు. కేటీఆర్ ప్రతిపాదనకు జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఎర్రవెల్లిలో కేసీఆర్తో కీలక భేటీ
నేడు అసలైన ముహూర్తం ఖరారు కానుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జీవన్ రెడ్డి ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీలో ఆయనకు దక్కే హోదా, కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యతపై తుది స్పష్టత రానుంది. కేసీఆర్తో చర్చల అనంతరం, ఆయన గులాబీ కండువా కప్పుకునే తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెస్కు మిగిలేది శూన్యమేనా?
జీవన్ రెడ్డి వంటి ఉద్దండుడు పార్టీని వీడటం కాంగ్రెస్కు ఊహించని దెబ్బే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకంటూ ఒక సొంత క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయంతో జిల్లాలో హస్తం పార్టీ బలహీనపడటమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ఓట్ల సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం ఉంది.
