AUS vs IND: విజయంపై అనుమానాలు నెలకొన్న వేళ టీమిండియా ఆసీస్ గడ్డపై తొలి టెస్టు కూర్పుపై దృష్టి పెట్టింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో టీమిండియా రెగ్యులర్ టాప్–3 బ్యాటర్లలో కెప్టెన్, రోహిత్, శుభ్ మన్ గిల్ లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టాపార్డర్లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఇక పేస్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలిటెస్టుకు పేసర్ జస్పిత్ బుమ్రా టీమిండియా కెప్టెన్ గా వ్యవరహించనున్నాడు. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బుమ్రా గతంలో ఒకే ఒక్క మ్యాచ్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కొవిడ్ బారిన పడటంతో అప్పట్లో బుమ్రా టీమిండియా సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2022లో ఇంగ్లండ్తో బర్మింగ్హామ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఇది కూడా చదవండి: IND vs AUS: కంగారూలపై హ్యాట్రిక్ అందేనా… ?
AUS vs IND: ఇప్పుడు మరోసారి సారథిగా వ్యవహరించనున్న బుమ్రా ..పేస్ స్వర్గధామం పెర్త్ లో ఏం చేస్తాడో చూడాలి. ఎందుకంటే పేసర్లను ఎదుర్కోవడంలో భారత్ తడబాటు ..గతంలో జట్టుకు పెట్టని కోటలా నిలిచి పెర్త్ టెస్టులో అద్భుత విజయం అందించిన పుజార, రహానేలు లేకపోవడంతో అసలు క్రీజులో బ్యాటర్లు నిలుస్తారా ? అన్న సందేహాలతో ముందే పరాజయాన్ని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నెల 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా భారత్ ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. నేడు విరామం తీసుకుని రేపటి నుంచి మ్యాచ్ వేదిక అయిన ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధన చేయనుంది.
సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా…మ్యాచ్కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్ ఆడటంపై చర్చ జరిగింది. కాగా, మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు రోహిత్ నిర్ణయం తీసుకోవడంతో తొలి మ్యాచ్నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో జరిగే రెండో టెస్టుకు రోహిత్ జట్టుతో చేరనున్నాడు. అంతేకాదు ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు నవంబర్ 30నుంచి ఆ్రస్టేలియన్ పీఎం ఎలెవన్ జట్టుతో జరిగే రెండు రోజుల పింక్ బాల్ వామప్ మ్యాచ్ కూడా ఆడతాడని తెలుస్తోంది.
శనివారం ప్రాక్టీస్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా శుబ్మన్ గిల్ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్ రాహుల్ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్కు కాస్త ఊరట. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై ఆందోళన నెలకొంది. అయితే ఎక్స్రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఆదివారం మళ్లీ బ్యాటింగ్ చేసిన రాహుల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్ సెషన్స్లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నట్లు రాహుల్ స్వయంగా వెల్లడించాడు.
ఇది కూడా చదవండి: SL vs NZL: న్యూజిలాండ్ పై శ్రీలంక రికార్డ్ విజయం!
AUS vs IND: రాహుల్ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్తో పాటు రెండో ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్ అవకాశం దక్కవచ్చు.
మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను కూడా ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. అవసరమైతే అతనూ టెస్టు సిరీస్ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ కూడా ఆ్రస్టేలియాలోనే ఉండి పోయారు.
పెర్త్ టెస్టులో ఆడే టీమిండియాలో మూడో పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. కెప్టెన్ గా వ్యవహరించే బుమ్రా, సిరాజ్లతో పాటు మూడో పేసర్గా ఇప్పటి వరకు ప్రసిధ్ కృష్ణ పేరు వినిపించింది. అంతేకాదు ప్రాక్టీస్ గేమ్లోనూ అతను రాణించాడు. అయితే నెట్ సెషన్స్లో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న హర్షిత్ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్లపై రాణించగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్ మధ్య మూడో పేసర్ స్థానం విషయంలో పోటీ నెలకొంది. ప్రసిధ్ ఇప్పటికే భారత్ తరఫున 2 టెస్టులు ఆడగా…హర్షిత్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టలేదు.
AUS vs IND: అయితే ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్ గేమ్లో తన స్వింగ్ బౌలింగ్లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్ లైనప్ను పటిష్టపర్చేందుకు నితీశ్ లాంటి ఆల్రౌండర్ అవసరం ఉన్న నేపథ్యంలో ఆదివారం టీమ్ ప్రాక్టీస్లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన మొహమ్మద్ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని…సిరీస్ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి.