విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల వైఖరిని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మోదీకి సన్నిహితంగానే ఉంటారని చెప్పారు. అయితే ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.
ఏపీలో పాలకులు మారినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారని విమర్శించిన జగ్గారెడ్డి, ఈ విషయంలో మాట మార్చిన చంద్రబాబు, జగన్కు ప్రజల ముందు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై స్పష్టమైన వైఖరితో ప్రజల తరఫున పోరాడాల్సిందని సూచించారు.
తనకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ముఖ్యమేనని జగ్గారెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
గతంలో ప్రాజెక్టులపై జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎప్పుడైనా గంభీరంగా చర్చలు చేశారా? అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, రాజకీయ భేదాలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.
