ISRO: 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశాన్ని మరో ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలను వేగవంతం చేసింది. వికసిత భారత్ లక్ష్యానికి సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో చీఫ్ ఎస్. నారాయణన్ ప్రకటించారు.

ప్రస్తుతం అంతరిక్ష రంగ అభివృద్ధికి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి –

  • 80 వేల కేజీలను మోసుకెళ్లగలిగే భారీ రాకెట్ల తయారీ,
  • 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం,
  • 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం (National Space Station) స్థాపన,
  • వీనస్ ఆర్బిటర్ మిషన్ ద్వారా చంద్రుడిపై, ఇతర గ్రహాలపై అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

ఇస్రో చీఫ్ నారాయణన్ మాట్లాడుతూ, 2027లో మానవసహిత గగనయాత్ర మిషన్ (Gaganyaan Mission) ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు. 2040 నాటికి తొలి మానవసహిత చంద్రయాత్ర చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారని, అందుకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

అదే సమయంలో, అంతరిక్ష రంగంలో భారతీయ స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. కొన్నేళ్ల క్రితం రెండు లేదా మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణ వంటి విభాగాల్లో 300కి పైగా స్టార్టప్‌లు సక్రియంగా పనిచేస్తున్నాయని వివరించారు.

ఉపగ్రహ ఆధారిత ప్రయోగాలు వ్యవసాయం, వాతావరణ అంచనాలు, వాహన పర్యవేక్షణ, కమ్యూనికేషన్ సేవలు వంటి అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయని నారాయణన్ తెలిపారు.

ఇస్రో ఈ ప్రణాళికలతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థాయిని మరింత ఉన్నతంగా నిలబెట్టబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *