Netanyahu

Netanyahu: ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన

Netanyahu: పశ్చిమ ఏసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలస్తీనాను దేశంగా గుర్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జోర్డాన్ నది పశ్చిమాన ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండదని, ఇజ్రాయెల్‌కు మధ్యలో ఉగ్రవాద రాజ్యాన్ని బలవంతంగా స్థాపించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై చేసిన దాడి, బందీల కిడ్నాప్ తర్వాత ఇజ్రాయెల్, హమాస్‌కు మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయంగా పాలస్తీనాకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే భారత్, రష్యా, చైనా సహా 147 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. ఇటీవల ఇజ్రాయెల్‌కు సన్నిహిత మిత్రదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సైతం పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది ఇజ్రాయెల్‌కు ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయాన్ని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఇది హమాస్ నరమేధానికి బహుమతి ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల గాజాలో మానవతా సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాలస్తీనాను దేశంగా గుర్తించాలనే డిమాండ్లు బలపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి మరిన్ని దేశాలు కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Pakistan: సొంత ప్రజలపైనే యుద్ధ విమానాలతో బాంబుల వర్షం: పాకిస్తాన్

ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వైఖరి ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంది. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తే హమాస్ బలోపేతం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు, ఈ అంశంపై భారత రాజకీయాల్లోనూ చర్చ మొదలైంది. పాలస్తీనా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్ ఇప్పటికే 37 ఏళ్ల క్రితమే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించిందని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు.

అక్టోబర్ నెలాఖరున ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాలస్తీనా అంశంపై తమ దేశం అధికారికంగా ప్రతిస్పందన ఉంటుందని ఆయన కార్యాలయం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మాట వింటాయని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడికి ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *