Isha Gramotsavam

Isha Gramotsavam: ఈశా గ్రామోత్సవం – తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా వేడుక

Isha Gramotsavam: 17వ ఈశా గ్రామోత్సవం తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈరోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో వైభవంగా జరిగాయి. ఈశా ఫౌండేషన్ వారు ఆగస్టులో 10 జిల్లాలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ పోటీలలో దాదాపు 3,300 ఆటగాళ్ళు పాల్గొనగా విజేతలుగా నిలిచిన జట్లు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డాయి. గౌరవ అతిధిగా శ్రీ మల్క కొమరయ్య గారు, ఎమ్మెల్సీ, ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆటగాళ్ళను ఉత్తేజపరిచారు. ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రీ భార్గవి గారు ఈ కార్యక్రమానికి వక్తగా ఉన్నారు.

వివిధ సాంస్కృతిక అంశాలతో కోలాహలంగా గ్రామోత్సవం జరిగింది. తెలంగాణలో మరుగున పడుతున్న కళలను పునర్జీవింపజేసేలా జరిగిన గిరిజన జానపద నృత్యం ‘గుస్సాడి’తో పాటు, చిరుతల రూపకం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రసిద్ధ ప్లేబ్యాక్ సింగర్ రామ్ మిర్యాల గారు, గాయిని స్ఫూర్తి జితేంద్ర గారు అందించిన ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఆటగాళ్ళు, ఇంకా పోటీలను చూడడానికి వచ్చిన గ్రామస్థులు అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. వాలీబాల్ పోటిల్లో అశ్వారావుపేట పోలీస్ టీం జట్టు మొదటి బహుమతి సొంతం చేసుకున్నారు. శివాలయం సిక్స్ బాయ్స్ జట్టు, చిన్నరేవల్లి జట్టు, వూట్‌పల్లి విబిఏ జట్టు తరువాతి స్థానాల్లో నిలిచారు. మహిళల త్రోబాల్ పోటీలలో రాచర్ల గొల్లపల్లి టీం ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, కొతపల్లి వారియర్స్ టీం, భద్రకాళి టీం, సంపల్లి వారియర్స్ టీంలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో గెలిచిన మొదటి రెండు జట్లు , సెప్టెంబర్ 21న ఈశా యోగాసెంటర్‌, కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద సద్గురు ఇంకా వేలాది మంది సమక్షంలో జరగబోయే జాతీయ ఫైనల్స్ లో పాల్గొంటారు.

ఫైనల్స్ లో గెలిచిన జట్లకు నగదు బహుమతులు – వాలీబాల్ (పురుషులు): రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు): రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేస్తారు. 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలలో 22 జిల్లాలలో ఈ పోటీలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *