Ali Larijani: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధినేత అలీ లారిజానీ ఈ విషయాని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ, ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానంతరం అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరుపుతారని వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.
చర్చలకు సముఖంగా లేని ఇరాన్
అమెరికా అనుసరిస్తున్న శత్రుత్వ విధానాల వల్ల ప్రస్తుతానికి చర్చలకు తగిన వాతావరణం లేదని అలీ లారిజానీ స్పష్టం చేశారు. “డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు మాపై దాడులకు మద్దతు తెలుపుతూ, మరోవైపు చర్చల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ శక్తులతోనూ మేము టేబుల్ మీద కూర్చోవడానికి సిద్ధంగా లేము” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ట్రంప్ ‘ప్రెషర్ టాక్టిక్స్’ పై ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా ఇరాన్పై ‘గరిష్ట ఒత్తిడి’ (Maximum Pressure) వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే కాకుండా, ఇటీవల టెహ్రాన్పై జరిగిన వైమానిక దాడులను సమర్థించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో ఉంది. ట్రంప్ చర్చల కోసం ఆహ్వానించినప్పటికీ, ఇరాన్ మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించింది. తమ దేశ గౌరవానికి భంగం కలిగించే షరతులతో కూడిన చర్చలకు వెళ్లబోమని లారిజానీ పునరుద్ఘాటించారు.
ప్రాంతీయ అస్థిరతపై ఆందోళన
అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ బలహీనపడిందని భావించడం అమెరికా పొరపాటని లారిజానీ హెచ్చరించారు. ఇరాన్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటుందని, ఇజ్రాయెల్ మరియు అమెరికా దుశ్చర్యలకు తగిన సమాధానం చెబుతామని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఇరాన్ తన అణు విధానాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నప్పటికీ, ఇరాన్ మరియు అమెరికా మధ్య మాటల యుద్ధం మాత్రం తగ్గడం లేదు.
