Narendra Modi

YogAndhra 2025: యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది..

YogAndhra 2025: విశాఖపట్నం ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైంది. ఈరోజు ఉదయం విశాఖ తీరాన ఉత్సాహంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తూ యోగం ప్రాధాన్యతను వివరిస్తూ హృదయాన్ని తాకే సందేశాన్ని ప్రజలకు అందించారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా అనేది భారతీయ జీవన విధానంలో అత్యంత ముఖ్యమైన భాగంగా అభివృద్ధి చెందిందన్నారు. “యోగా ప్రపంచ దేశాలను కలిపే మానవతా వేదిక. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించిన సమయంలో 175 దేశాలు మద్దతు ఇవ్వడం భారత సంస్కృతికి గౌరవంగా నిలిచింది,” అని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిలో యోగా వేడుకలు జరగడం సాధారణ విషయం కాదని, ఇది మనదేశపు ఆధ్యాత్మిక సంపదకు గుర్తింపని చెప్పారు.

ఇప్పటివరకు కోట్లాది మంది ప్రజలు యోగాను జీవితంలో భాగంగా చేసుకున్నారని, అది ప్రజల జీవనశైలిని మార్చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. “యోగా వయసుతో సంబంధం లేని సామూహిక ప్రక్రియ. ఇది వ్యక్తిగత క్రమశిక్షణను పెంపొందించి, మానసిక ప్రశాంతతను అందించే మార్గం. ఇది మనలో మానవత్వాన్ని పెంచుతుంది,” అని ప్రధాని వివరించారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని “వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే థీమ్‌తో జరుపుకుంటున్నామని తెలిపారు. ఇది యోగా ఆచరణ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యమే కాదు, ప్రపంచ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచే దిశగా ఒక ప్రణాళిక అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Yoga Day: విశాఖలో యోగాంధ్ర వేడుకలు.. 5 లక్షల మందితో యోగాసానాలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ

ప్రపంచం ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో యోగా శాంతికి మార్గం చూపిస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. “యోగా ‘నేను’ అనే భావన నుంచి ‘మనము’ అనే గొప్ప ఆత్మబంధానికి తీసుకెళ్లే మార్గం. ఇది మానవతా విలువలను పెంచే ఆయుధం,” అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన యువతకు ఓ సందేశం ఇచ్చారు – “తినే ఆహారంలో నూనె పదార్థాలను కనీసం 10 శాతం తగ్గించండి. ఒబేసిటీ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారింది. యోగాను జీవనశైలిగా మలుచుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు.”

విశాఖపట్నం నగరాన్ని ‘ప్రగతి మరియు ప్రకృతి సంగమస్థలిగా’ ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ నగరం అభివృద్ధికి, సంస్కృతి ప్రచారానికి ఒక కేంద్రంగా మారుతోందని ప్రశంసలు కురిపించారు. భారత నౌకాదళానికి చెందిన నౌకలపై సైనికులు యోగాసనాలు వేస్తున్న దృశ్యాలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇది భారతదేశం యోగాను ఏ స్థాయికి తీసుకెళ్లిందో నిరూపించాయి.

ALSO READ  TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి భక్తులకు సూపర్ పవర్స్..

మొత్తానికి, విశాఖ వేదికగా జరిగిన ఈ యోగా దినోత్సవం కేవలం ఓ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరోసారి గర్వంగా పరిచయం చేసిన ఒక మహోన్నత సందర్భం. ఆరోగ్యపరమైన చైతన్యం, మానవతా విలువల కలయికగా యోగా భారతదేశం నుండి ప్రపంచానికి అందిస్తున్న గొప్ప బహుమతిగా నిలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *