Inter Student: ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో వాష్రూమ్లో మృత శిశువుకు జన్మనిచ్చిన ఒక విద్యార్థిని ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఒక ప్రైవేట్ కాలేజీకి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని శుక్రవారం పరీక్ష రాయడానికి పట్టణంలోని కేజీబీవీ కాలేజీ సెంటర్కు వెళ్లింది. పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ పర్మిషన్ అడిగి వాష్రూమ్కు వెళ్లిన ఆ బాలిక, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ స్వీపర్ను అక్కడికి పంపించారు.
అయితే తనకు పీరియడ్స్ వచ్చాయని ఆ బాలిక చెప్పడంతో, సిబ్బంది వెంటనే అవసరమైన ప్యాడ్స్, న్యాప్ కిన్స్ తెప్పించి ఇచ్చారు. అనంతరం ఆమె తిరిగి హాల్లోకి వచ్చి పరీక్ష రాయడం మొదలుపెట్టింది. కాసేపటికి స్వీపర్ వాష్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లగా, అక్కడ బేసిన్లో మృత శిశువు ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపాల్కు తెలియజేయగా, వారు బాలికను విచారించారు. గర్భవతి అనే విషయం బయటకు వస్తే పరువు పోతుందని భయపడి, శిశువును బేసిన్లో కుక్కినట్లు ఆమె అంగీకరించింది.
పరీక్ష ముగిసిన వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కొన్ని టాబ్లెట్లు వేసుకోవడం వల్లే అబార్షన్ జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
