India Census: కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేశవ్యాప్త జనగణన ప్రక్రియకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. 2021లో జరగాల్సిన ఈ జనాభా లెక్కల సేకరణ కరోనా కారణంగా వాయిదా పడగా, ఇప్పుడు సరికొత్తగా పూర్తిగా డిజిటల్ రూపంలో దీనిని నిర్వహించేందుకు హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భారీ ప్రక్రియలో భాగంగా తొలి దశను ‘గృహ గణన’ (హౌస్ లిస్టింగ్) పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించి, సెప్టెంబర్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరు నెలల కాలంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి కనీసం 30 రోజుల సమయం కేటాయించి, దేశంలోని ప్రతి ఇల్లు, భవనం, నివాస నిర్మాణాల వివరాలను క్షుణ్ణంగా సేకరించనున్నారు.
ఈసారి జనగణనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ మొబైల్ యాప్ల ద్వారా వివరాలను నమోదు చేయనున్నారు. ఇది కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాకుండా, దేశంలో తొలిసారిగా కులగణనను కూడా ఈ ప్రక్రియతో కలిపి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర పరిధిలో కులగణనను పూర్తి చేయగా, ఇప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా దీనిని చేపట్టబోతోంది. రెండవ దశలో భాగంగా అసలైన జనాభా లెక్కల సేకరణను 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరగడమే కాకుండా, ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.
Also Read: Nara lokesh: కఠిన పరిస్థితులే నిజమైన ఛాంపియన్లను తయారు చేస్తాయి
ఈ బృహత్తర కార్యక్రమం కోసం క్షేత్రస్థాయిలో లక్షలాది మంది సిబ్బందిని మోహరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నిర్వహించిన ‘ప్రీ-టెస్ట్’ ప్రక్రియ విజయవంతం కావడంతో, ఇంటి యజమానులను అడగాల్సిన ప్రశ్నలు, మొబైల్ యాప్లో భద్రతా ఫీచర్లు, అధికారుల మధ్య సమన్వయంపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ ప్రక్రియ, దేశ భవిష్యత్తు ప్రణాళికలకు సంక్షేమ పథకాల అమలుకు అత్యంత కీలకం కానుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ గృహ గణనతో దేశవ్యాప్తంగా ప్రతి గడపకూ గణన సిబ్బంది చేరుకోనున్నారు.
