Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా (సుమారు 2005 సంవత్సరం నుంచి) తన ఆధీనంలో ఉంచుకున్న అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను వదులుకున్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో, ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన సమ్రాట్ చౌదరికి ఈ హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం కొత్త కేబినెట్ పోర్ట్ఫోలియోలను ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన పక్షంగా ఎదగడం, అలాగే సంకీర్ణ కూటమిలో బీజేపీకి పెరిగిన ప్రాధాన్యతకు ఈ నిర్ణయం సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హోం శాఖ రాష్ట్రంలోని శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది.
నితీష్ కుమార్ నుంచి హోం శాఖ పగ్గాలు చేపట్టడం ద్వారా ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ప్రాధాన్యత, అధికారం గణనీయంగా పెరిగాయి. ఆయన ఇకపై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, గతంలో బీజేపీ వద్ద ఉన్న ఆర్థిక శాఖను ఈసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి కేటాయించారు. సీనియర్ జేడీయూ నాయకులు బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఆర్థిక శాఖను పొందారు.
ఇది కూడా చదవండి: RGV: పైరసీ ఎప్పటికీ ఆగదు.. వర్మ సంచలన ట్వీ్ట్
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం సాధారణ పరిపాలన శాఖ, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. నితీష్ కుమార్ 2005 నుంచి అనేక సంకీర్ణ ప్రభుత్వాలలో హోం శాఖను తన వద్దనే ఉంచుకున్నారు. ఈ నిర్ణయం బీహార్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా చూడబడుతోంది.
