Hyderabad: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం నాడు ప్రగతిభవన్లో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేసే విధంగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దోహదపడేలా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రీడాకారుల శిక్షణ, ఆధునిక క్రీడా మైదానాల అభివృద్ధి, గ్రామ స్థాయినుంచి అంతర్జాతీయ స్థాయికి గల దారిని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలసీ రూపొందించబడినట్లు సమాచారం.
పీసీ ఘోష్ కమిషన్పై పూర్తి నివేదికకు ఆదేశం
పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన మినిట్స్తో పాటు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది. కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రైతు భరోసా విజయోత్సవ సభలు రేపే
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందన్న నేపథ్యంలో, రేపు (మంగళవారం) అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని రైతులకు అందిస్తున్న మద్దతును వివరించనున్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులపై స్పెషల్ డ్రైవ్
ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దాఖలు చేసిన 9 లక్షల ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.