Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం ముగిసింది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చా విషయంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆగష్టు 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లపై న్యాయం చేయాలని కోరనున్నారు. అంతేగాక, బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి మద్దతు కూడా కోరనున్నారు.
ఇక మరోవైపు, బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లుపై కేంద్రం స్పందన లేకుండా పెండింగ్లో ఉంచినట్టు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తవడంతో, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేబినెట్ భావించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, బీసీ హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కీలక అడుగులు వేయనుంది.

