Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా మెనూ రూపొందించారు.
విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు తృణధాన్యాలతో తయారైన బిస్కెట్లు (మిల్లెట్ బిస్కెట్లు), పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి ఐటములను ప్రతిరోజు ఒక్కటి చొప్పున అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ అల్పాహారాన్ని అందించేందుకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తోంది.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు సాయంత్రం స్టడీ అవర్స్లో విద్యార్థులకు ఈ అల్పాహారం అందించనున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శక్తినివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

