Child Trafficking: భాగ్యనగరంలో అక్రమంగా శిశువులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను మాదాపూర్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఇద్దరు శిశువులను సురక్షితంగా రక్షించారు.
మాదాపూర్ డిసిపి (రీతి రాజ్) తెలిపిన వివరాల ప్రకారం:
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా శిశువులను విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కీలక నిందితుడితో పాటు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఠా పనితీరు – విచారణలో తేలిన కీలక విషయాలు:
ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండి ఈ అక్రమ దందాను కొనసాగిస్తోంది. ఆర్థికంగా చితికిపోయి, పిల్లల్ని పెంచలేని స్థితిలో ఉన్న కుటుంబాలే ఈ ముఠా ప్రధాన లక్ష్యం. వారి పరిస్థితులను గమనించి, డబ్బు ఆశ చూపి తక్కువ ధరకే పసిబిడ్డలను కొనుగోలు చేస్తారు. పేద కుటుంబాల దగ్గర తక్కువ మొత్తానికి శిశువులను కొని, సంతానం లేని ధనిక దంపతులకు రూ. 15 లక్షల వరకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారమంతా మధ్యవర్తుల ద్వారా పక్కా ప్లాన్తో జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Bus Accident: బస్సు టైరు పేలి రెండు కార్లు ధ్వంసం.. తొమ్మిది మంది దుర్మరణం!
ఐవీఎఫ్ ఏజెంట్ ప్రధాన నిందితుడు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన వి. బాబు రెడ్డి, గతంలో ఐవీఎఫ్ (IVF) ఏజెంట్గా పనిచేసేవాడు. ఇతను తన పరిచయాలను వాడుకుంటూ ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు.
నిందితులు కొంతకాలం క్రితం గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి ఒక శిశువును విక్రయించడానికి హైదరాబాద్కు తీసుకువచ్చారు. మరొక శిశువును సిద్దిపేట జిల్లా రాయపోల్ (లేదా రాంపేట) ప్రాంతం నుండి సేకరించినట్లు సమాచారం.
శిశు విహార్కు పసికందుల తరలింపు
సకాలంలో స్పందించిన పోలీసులు శిశువులను కాపాడి, తదుపరి సంరక్షణ కోసం వారిని శిశు విహార్కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు.
