Hyderabad: హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన ఒక షాకింగ్ డ్రగ్స్ రాకెట్ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. నైజీరియాకు చెందిన ఒక వ్యక్తి స్టూడెంట్ వీసా మీద భారత్కు వచ్చి, గత నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ దందా సాగిస్తున్నాడు. అయితే ఇతగాడి స్టైల్ మిగతా స్మగ్లర్ల కంటే భిన్నం. కేవలం ప్రేమ, సహజీవనం (Living Together) పేరుతో అమాయక యువతులను బుట్టలో వేసుకోవడం, ఆ తర్వాత వారిని తన డ్రగ్స్ వ్యాపారానికి ఏజెంట్లుగా మార్చుకోవడం ఇతని ప్రధాన వృత్తిగా మారింది.
నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించేవాడు. ప్రతి మూడు నెలలకోసారి తన నివాసాన్ని మార్చేవాడు. హైదరాబాద్, బెంగళూరు, గోవా వంటి నగరాల్లో ఏకంగా ఐదు ఇళ్లను అద్దెకు తీసుకుని మకాం మార్చుతూ వచ్చేవాడు. ఇప్పటివరకు సుమారు ఏడుగురు యువతులతో సహజీవనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులకు గాలం వేసి, వారికి ఉచితంగా మత్తు పదార్థాలు ఇస్తూ తన గుప్పిట్లోకి తెచ్చుకునేవాడు. వారి ద్వారానే గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాల సరఫరా చేయించేవాడు.
ఈ దందాలో నిందితుడు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ‘కోడ్ భాష’ను వాడేవాడు. ఉదాహరణకు, ఎవరికైనా డ్రగ్స్ కావాలంటే ఫోన్లో నేరుగా మాట్లాడకుండా మూడు క్వశ్చన్ మార్కులు (???) పంపేవారు. అలాగే రకరకాలను బట్టి ‘ఓషన్’, ‘సముద్రం’, ‘బకరా’ వంటి పదాలను సంకేతాలుగా వాడేవాడు. కొంపల్లిలో నర్సుగా పనిచేసే ఒక యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, ఆమె ఇంట్లోనే డ్రగ్స్ నిల్వ ఉంచి వ్యాపారం సాగించడం చూస్తుంటే ఇతని నెట్వర్క్ ఎంత ప్రమాదకరంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
చివరికి నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (HNEW) అధికారులు పక్కా ప్లాన్తో ఈ నిందితుడిని పట్టుకున్నారు. యువతులు, విద్యార్థులు ఇలాంటి అపరిచిత వ్యక్తుల పట్ల, ముఖ్యంగా ప్రేమ పేరుతో దగ్గరయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం విలాసాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
