Hyderabad Metro Rail: హైదరాబాద్ మహానగరం మరింత విస్తరిస్తున్నది. ఇప్పడు ఓఆర్ఆర్ వరకు ఉన్న నగరం.. అది దాటి ట్రిపుల్ ఆర్ వరకూ విస్తరణ కానున్నది. ఇప్పటికే ఓఆర్ఆర్ లోపలి భాగం అంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి రానున్నది. సుమారు 300 కార్పొరేషన్లతో నగరాన్ని విస్తరిస్తూ పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ మేరకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో రైలు విస్తరణకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.
Hyderabad Metro Rail: తెలంగాణ రైజింగ్ విజన్- 2047 ప్రణాళిక మేరకు మెట్రో లైన్ను 400 కిలోమీటర్లకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల మేర సేవలు అందుబాటులో ఉండగా, రెండో దశలో మరో 152.5 కిలోమీటర్ల పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యంత కీలకమైన మూడో దశలో మెట్రోను దాదాపు 178.3 కిలోమీటర్ల మేర విస్తరించాలని కొత్త మార్గాలతో సహా ప్రతిపాదించారు.
Hyderabad Metro Rail: ఈ మేరకు మెట్రో 400 కిలోమీటర్ల వరకు విస్తరణ పూర్తయితే అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న శివారు ప్రాంతాలకు కూడా మహాద్భుతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ నగర వాసులకు వేధించే ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తున్నది. దీనివల్ల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇప్పటికే విశ్వనగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్.. మహా విశ్వనగరంగా రూపుదిద్దుకోనున్నది.
