Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా నమోదవుతోంది.
వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం, శనివారం రోజుల్లో శీతల మరియు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో సంబంధం కలిగిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పొగమంచు మరింతగా పెరిగే అవకాశం ఉందని సూచించారు.
శీతల గాలులు, ఘనమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయంలో ప్రయాణించే వారు చలి తీవ్రతకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సలహా ఇచ్చారు.

