Hyderabad: బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు వస్తున్న గల్ఫ్ ఎయిర్ GF274 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. 154 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానాన్ని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ముంబైకి మళ్లించారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ మెయిల్ ఐడీకి ఒక ఈ-మెయిల్ వచ్చింది. అందులో విమానంలో బాంబు పెట్టినట్లు పేర్కొనడంతో వెంటనే భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఈ కారణంగా, శనివారం రాత్రి 10:20కి బహ్రెయిన్లో బయలుదేరి, అసలు ప్లాన్ ప్రకారం ఆదివారం ఉదయం 4:55కు హైదరాబాద్లో దిగాల్సిన ఈ విమానాన్ని ముంబైకి మళ్లించారు.
ముంబైలో విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని భద్రతా ప్రక్రియలు పూర్తయ్యాక, అక్కడి నుంచి తిరిగి బయలుదేరిన ఈ విమానం ఉదయం 11:31 గంటలకు హైదరాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై గల్ఫ్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల వల్ల విమానాన్ని మళ్లించామని, అవసరమైన ప్రోటోకాల్స్ పూర్తయ్యాక మాత్రమే తిరిగి హైదరాబాద్కు పంపామని స్పష్టం చసింది
ఇటీవలి కాలంలో హైదరాబాద్ విమానాశ్రయాలకు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం ఇది మూడోసారి. గత జూన్లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో దానిని వెనక్కి పంపించారు. అదే నెలలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన మరో బెదిరింపు నకిలీదిగా తేలింది.
