Hyderabad: నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదం పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. భవనంలో చెలరేగిన మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది, పోలీసు బృందాలు మరియు రెస్క్యూ టీములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఘటనాస్థలికి NDRF బృందం కూడా చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. దాదాపు ఆరు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో భవనంలోకి ప్రవేశించడం కూడా ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి. భవనంలో చిక్కుకున్న వాచ్మెన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా వాచ్మెన్ కుమారులు అఖిల్ (7), ప్రణీత్ (11) భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం ఉండటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
