Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఒక ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో ఉన్న దహన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భవనం నాలుగు అంతస్తుల వరకు విస్తరించాయి.
ఈ ఘటనలో భవనంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, నాలుగు ఫైర్ ఇంజన్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసే ప్రయత్నం చేస్తున్నాయి.
ఫైర్ సిబ్బంది మంటలతో పాటు భవనంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, షార్ట్ సర్క్యూట్ లేదా ఫర్నీచర్లోని దహన పదార్థాల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు అగ్నిప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత తెలియనున్నాయి.
