AP News: తల్లిదండ్రులు చేసిన చిన్న పొరపాటు ఒక కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. ఇంట్లో ఫ్లాస్క్లో పోసి ఉంచిన వేడి టీ తాగిన కారణంగా నాలుగేళ్ల పసివాడు ప్రాణాలు కోల్పోగా, అతని రెండేళ్ల చెల్లెలు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో చోటుచేసుకుంది.
పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంట్లో ఘోరం
యాడికి పట్టణంలోని చెన్నకేశవ కాలనీకి చెందిన రామస్వామి, చాముండేశ్వరి దంపతులకు కుమారుడు రుత్విక్ (4), కుమార్తె యశస్విని (2) ఉన్నారు. ఈ నెల 8వ తేదీన తల్లిదండ్రులు ఎప్పటిలాగే పనులకు వెళ్లేటప్పుడు, తమ కోసం వేడి వేడి టీని ఫ్లాస్క్లో పోసి పక్కన ఉంచారు.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, ఆటలాడుకుంటున్న చిన్నారులిద్దరూ ఫ్లాస్క్లోని వేడి టీని గ్లాసుల్లోకి ఒంపుకుని తాగారు. టీ తీవ్రమైన వేడికి పసివారి గొంతు లోపలి భాగాలు తీవ్రంగా కాలిపోయాయి.
ఇది కూడా చదవండి: TG High Court: స్థానిక ఎన్నికల జరుపుకోండి.. కానీ వన్ కండిషన్
చికిత్స పొందుతూ బాలుడి మృతి
తీవ్రమైన నొప్పి భరించలేక రుత్విక్, యశస్విని ఇద్దరూ ఏడుస్తుండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని తాడిపత్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు.
అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రుత్విక్, శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. టీ వేడికి ఊపిరి ఆగిపోయి బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్ల పాప యశస్వినికి మాత్రం చికిత్స కొనసాగుతోంది, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ హృదయ విదారక ఘటన ఆ కాలనీలో, యాడికి పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వేడి పానీయాలను, ప్రమాదకర వస్తువులను చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా, అత్యంత జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.