Crime News: నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆవరణలో ఘోరం జరిగింది. దర్శనం కోసం వచ్చిన ఓ వివాహిత మహిళపై ఆలయ ఉద్యోగితో పాటు మరో ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను చేతులు కాళ్లు కట్టేసి దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఉమ్మడి పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత మహిళ అంజన్న దర్శనం కోసం ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. దర్శనం అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అనంతరం బహిర్భూమికి వెళ్లినట్లు మాటు వేసి గుర్తించిన యువకులు పక్కనే ఉన్న గుట్ట పైకి ఈడ్చుకెళ్ళి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించి వెతుకుతుండడంతో వారిని గ్రహించిన యువకులు చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి పరారయ్యారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల అరిష్, మహేష్, వాగుల్ధార్ మణికంఠలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు.