Road Accident: కర్ణాటక రాష్ట్రంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఒక లారీ వేగంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెను ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిందిలా..
చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలోని గోరట్టు వద్ద గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
నిద్రలోనే అనంత లోకాలకు..
ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. లారీ ఢీకొన్న వెంటనే మంటలు బస్సును చుట్టుముట్టడంతో,ప్రాణాలు కాపాడుకునేందుకు కనీసం ప్రయత్నించే లోపే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: మెడికల్ కాలేజీల నిర్మాణంపై వెనక్కి తగ్గేదే లేదు
మృతుల సంఖ్యపై గందరగోళం
ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి:
- స్థానిక సమాచారం: ఘటనా స్థలంలో 17 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
- అధికారిక అంచనా: ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 30 దాటవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- రెస్క్యూ ఆపరేషన్: ప్రస్తుతం పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టతరంగా మారింది.
ఘటనా స్థలంలో భీతావహ దృశ్యాలు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
