Trump-Machado: వెనిజులా రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో, ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అందజేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జనవరి 15, 2026న వైట్హౌస్లో జరిగిన సమావేశంలో ఆమె ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి గానూ 2025లో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అయితే, తన దేశ స్వేచ్ఛ కోసం ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలకు కృతజ్ఞతగా ఆమె ఈ బంగారు పతకాన్ని ఆయనకు సమర్పించారు.
Also Read: CM Chandrababu: కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన: సీఎం చంద్రబాబు
ఈ సమావేశం సందర్భంగా మచాడో మాట్లాడుతూ, 200 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ జనరల్ మార్క్విస్ డి లఫాయెట్.. వెనిజులా స్వేచ్ఛా యోధుడు సైమన్ బోలివర్కు జార్జ్ వాషింగ్టన్ ముఖచిత్రంతో ఉన్న మెడల్ను బహుకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అదే చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తూ, వెనిజులా ప్రజల తరపున వాషింగ్టన్ వారసుడైన ట్రంప్కు ఈ నోబెల్ పతకాన్ని అందజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన కొద్ది రోజుల్లోనే ఈ భేటీ జరగడం గమనార్హం.
మరోవైపు, ఈ బహుమతి బదిలీపై నోబెల్ కమిటీ భిన్నంగా స్పందించింది. నోబెల్ శాంతి బహుమతిని ఒకసారి ప్రకటించిన తర్వాత దాన్ని ఇతరులకు బదిలీ చేయడం లేదా పంచుకోవడం సాధ్యపడదని, ఆ అవార్డు కేవలం గ్రహీతకే చెందుతుందని కమిటీ స్పష్టం చేసింది. అయితే, మచాడో మాత్రం ఇది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదని, వెనిజులా స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు ఇస్తున్న గౌరవమని వెల్లడించారు. ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని మచాడోను ప్రశంసించారు.
