The Raja Saab

Rajasaab: నిర్మాతలకు షాక్.. పాత రేట్లకే టికెట్లు అమ్మాలి..

Rajasaab: హైదరాబాద్‌లో ‘రాజాసాబ్’ సినిమా నిర్మాతలకు అనుకోని నిరాశ ఎదురైంది. ప్రభాస్‌ చిత్రంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చే మెమో జారీ చేసింది. విడుదల సమయానికి థియేటర్లలో పెరిగిన రేట్లతో టికెట్ అమ్మకాలు జరగాలని నిర్మాతలు భావించారు. ఈ పెంపు, సినిమా కలెక్షన్లను పెంచుతుందనే నమ్మకంతో, బృందం ప్రత్యేక షోలు, అదనపు ధరల ప్లాన్లు కూడా సిద్ధం చేసింది.

అయితే, అదే మెమోను పలు సామాజిక సంస్థలు, సినిమా ప్రియులు, మరియు పిటిషనర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. వారి వాదన ప్రకారం, ప్రభుత్వం వరుసగా సినిమాలకు టికెట్ ధరలు పెంచడానికి మెమోలు జారీ చేస్తోంది. ఈ విధానం పారదర్శకంగా లేదని, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోందని వారు సదరు పిటిషన్‌లో వాదించారు. కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పెంపుల కోసం ప్రభుత్వానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

విచారణ అనంతరం హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు మెమోను రద్దు చేసింది. ప్రస్తుతానికి పాత రేట్లకే టికెట్లు అమ్మాలని క్లారిటీ ఇచ్చింది. సినిమాకి ముందుగా ఇచ్చిన అనుమతులు మరియు గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలకు కూడా ఇది విరుద్ధంగా ఉందని కోర్టు గుర్తించింది. ఇకపై ఏ సినిమా టికెట్ రేట్ల పెంపుకు కొత్త విధానం అవసరమని కూడా సూచించింది.

ఈ తీర్పుతో ‘రాజాసాబ్’ సినిమా నిర్మాతలు పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరల పెంపు ఆర్థికంగా ఎంత కీలకమో తెలిసిన విషయం. పాత ధరలను అనుసరించడంతో ఆదాయం ఆశించినంతగా రాకపోవచ్చని సినిమా బృందం ఆందోళన చెందుతోంది. మరోవైపు ప్రేక్షకులు దీనిని స్వాగతించే అవకాశం ఉంది. పెరిగిన ధరల కారణంగా బయపడ్డ అభిమానులకు ఈ తీర్పు ఊరట కలిగిస్తుంది.

తదుపరి జరుగాల్సిన ప్రక్రియ ఆసక్తిక‌రంగా మారింది. ప్రభుత్వం కోర్టు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధాన మార్పులను చేస్తుందా? ఇంకా నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తారా? ఇవన్నీ రాబోయే రోజులలో స్పష్టమవుతాయి. అయితే ప్రస్తుతానికి, థియేటర్లు పాత టికెట్ రేట్లతోనే అమ్మకాలు కొనసాగించాల్సిందే అన్నది హైకోర్టు తుది మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *