Heavy Rains: ఒక్కసారిగా మారిపోయిన హైదరాబాద్ వాతావరణం పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా హయత్నగర్లో విజయవాడ జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీరు నిలవడంతో పాటు, మ్యాన్హోల్స్ మరియు గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో వాహనదారులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే… మెదక్ జిల్లాలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల్లోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మళ్లీ నీటిలో మునిగిపోయారు. అనేక కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్..!
ఈ భారీ వర్షాల ప్రభావంతో మెదక్–హైదరాబాద్ జాతీయ రహదారి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్కం బోర్డు వద్ద వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికులు వర్షం ఆగిన తర్వాత కూడా పరిస్థితి మరింత కష్టతరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, కాలువలు, డ్రైనేజీలను శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
