Harish Rao: రాష్ట్ర మంత్రివర్గంపై బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నైని బొగ్గుగనుల టెండర్ల అంశంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తొలుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చిన కథనాలు.. అనంతర పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. జనవరి 19న తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
Harish Rao: ఇది క్యాబినెట్ కాదని, ఇది దండుపాళ్యం ముఠా.. అని తన్నీరు హరీశ్రావు సంచలన ఆరోపణలు చేశారు. నైని బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. తన్నుకొని ఈ విషయాన్ని బయట పెట్టారంటూ ఆరోపించారు. ఈ దండుపాళ్యం ముఠా వాటాల గొడవలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలయ్యారని తెలిపారు.
Harish Rao: కాంట్రాక్ట్ సైట్ విజిట్ అనే విధానం నైని బ్లాక్లో పెట్టారన్న కారణంతోనే టెండర్లను రద్దు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, కానీ గతంలో ఎప్పుడూ కాంట్రాక్టు సంస్థకు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఎక్కడా, ఎప్పుడూ లేదని హరీశ్రావు తేల్చి చెప్పారు.
Harish Rao: ఈ కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తెచ్చిందే రేవంత్రెడ్డి ప్రభుత్వమని హరీశ్రావు చెప్పారు. ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి లబ్ధి పొందింది రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి కంపెనీ షోదా కన్స్ట్రక్షన్ అని, ఈ సంస్థే తొలి టెండర్ను దక్కించుకున్నదని ఆరోపించారు. ఇలా లబ్ధి పొందడానికే రేవంత్రెడ్డి ఈ విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
Harish Rao: టెండర్లు వేయడానికి తొలుత సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని హరీశ్రావు తెలిపారు. దీంతో ఆన్లైన్లో టెండర్ దాఖలుకు ముందే సదరు కాంట్రాక్టర్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎవరు సర్టిఫికెట్ కోసం సైట్ విజిట్కు వచ్చారో.. ప్రభుత్వానికి ముందే తెలిసిపోతుంది. అంటే వారే టెండర్ వేస్తారని నిర్ధారణకు వస్తుంది. ఆ తర్వాత వారిని భయభ్రాంతులకు గురి చేసి టెండర్లను రద్దు చేసుకోవాలని ఒత్తిడి తేవడం, లేదా తమకు అనుకూలంగా వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీశ్రావు ఆరోపించారు.
Harish Rao: రేవంత్రెడ్డికి బీజేపీతో అక్రమ బంధం లేకపోతే ఈ నైని బ్లాక్ టెండర్ల రద్దుపై సీబీఐ విచారణకు బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదేశించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఒకవేళ కిషన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశిస్తే నైని బ్లాక్ టెండర్లలో జరిగిన గోల్మాల్ వ్యవహారాలపై తన వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
Harish Rao: కాంట్రాక్ట్ విజిట్ సర్టిఫికెట్ లేదని నైని బ్లాక్ రద్దు చేశారని, కానీ, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని, ఈ సర్టిఫికెట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని ఈ సందర్భంగా హరీశ్రావు డిమాండ్ చేశారు.
