Harish Rao: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేశారని, ఆయన పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో బలోపేతమైందని ఆయన గుర్తు చేశారు. ఇటీవల కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఆర్థిక వృద్ధి గురించి హరీష్ రావు వివరిస్తూ.. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం (GSDP) మరియు తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగాయని, గణాంకాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక అరాచకం జరిగిందన్న రేవంత్ రెడ్డి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ఆడుతూ రాష్ట్ర పరువును బజారున పడేయవద్దని హితవు పలికారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలపై కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ రేవంత్ పైకి వచ్చారని, గతంలో పీసీసీ పదవిని కోట్లు పెట్టి కొనుగోలు చేశారన్న సొంత పార్టీ నేతల ఆరోపణలను గుర్తు చేశారు. తాము పదవుల కోసం పాకులాడే రకం కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే, మంత్రి పదవులను త్యాగం చేసిన చరిత్ర తమదని గర్వంగా చెప్పారు. నిబద్ధత మరియు త్యాగాల పునాదుల మీద ఎదిగిన తమ నాయకత్వాన్ని విమర్శించే నైతిక హక్కు రేవంత్కు లేదని హరీష్ రావు మండిపడ్డారు.
