New Year 2026: గత ఏడాది తాలూకు జ్ఞాపకాలను సాగనంపుతూ, 2026 నూతన సంవత్సరానికి యావత్ భారతావని అత్యంత వైభవంగా స్వాగతం పలికింది. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పల్లె, ప్రతి పట్టణం ఒకే రకమైన ఉత్సాహం, ఉద్వేగంతో ఉరకలేశాయి. ఈ వేడుకలు కేవలం ఆధునిక హంగులతో కూడిన వినోదంగా మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, వినూత్న ఆలోచనల కలయికగా నిలిచాయి. దేశవ్యాప్త దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రధాన నగరాల్లో బాణసంచా కాంతులు అంబరాన్నంటాయి. కన్యాకుమారి వద్ద 2026 తొలి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
టెక్నాలజీ హబ్గా పేరొందిన భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్లు విద్యుత్ దీపాల కాంతులతో ధగధగలాడాయి. అంతర్జాతీయ డీజేల సంగీత హోరు, అత్యాధునిక కినిటిక్ స్టేజ్ డిజైన్ల మధ్య వేలాది మంది యువత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘కార్నివైబ్’ ఉత్సవాలు కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాలు అర్ధరాత్రి బాణసంచా వెలుగుల్లో తళతళలాడిపోయాయి.
Also Read: CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ దిశగా అడుగులు.. సీఎం చంద్రబాబు
నగరం అంత ఆటపాటలతో సందడిగా మారాయి. అర్ధరాత్రి 12 గంటల కాగానే నగరవాసులు కేక్ కటింగ్లు, కేరింతలతో హోరెత్తించారు. అయితే ఈ వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు, ‘ఈగిల్ ఫోర్స్’ వంటి ప్రత్యేక బృందాలు గట్టి నిఘా ఉంచాయి. బాధ్యతాయుతమైన వేడుకల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి పాత ఏడాదికి ఘనంగా సెండాఫ్ ఇచ్చి, కొత్త ఆశలతో 2026కి భారత్ సాదర స్వాగతం పలికింది.
