Supreme Court: రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు న్యాయస్థానం నిర్దిష్ట కాలపరిమితిని (Fixed Timeline) విధించలేదని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఎందుకంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201లో గడువుకు సంబంధించిన ప్రస్తావన లేదంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద కోరిన సలహామేరకు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు అపరిమిత అధికారాలను వినియోగించలేరు.
వారికి ఆర్టికల్ 200 కింద విచక్షణాధికారం ఉన్నప్పటికీ, దానిని సక్రమంగా వినియోగించాలి. అయితే, గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులను సుదీర్ఘకాలం తమ వద్దే ఉంచుకొని, నిర్ణయాన్ని జాప్యం చేస్తే, ఆ జాప్యాన్ని న్యాయస్థానం సమీక్షించవచ్చు అని తెలిపింది. బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పుడు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేసినప్పుడు, గవర్నర్లు తప్పనిసరిగా కారణాన్ని పేర్కొనాల్సి ఉంటుందని చెప్పింది. ఆర్టికల్ 200లో గవర్నర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉందంది.
ఇది కూడా చదవండి: IBOMMA: ఇమండి రవి లవ్ స్టోరీ.. అమీర్పేట్ నుండి 20 కోట్ల వరకు
తమిళనాడు వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తమ అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉంచడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గతంలో ఒక ధర్మాసనం కొంత గడువును కూడా సూచించింది. అయితే, రాజ్యాంగ పదవుల అధికారాలలో న్యాయవ్యవస్థ జోక్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగ ధర్మాసనాన్ని సలహా కోరడంతో, తాజాగా ఈ కీలక తీర్పు వెలువడింది.
