Gottipati Ravikumar: వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రసక్తే లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల అంగీకారమేకి కీలకం అని, వారికి స్పష్టమైన అవగాహన కల్పించకముందు ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆయన అధికారులను హెచ్చరించారు.
విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, “స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గృహాలకు మీటర్లు అమర్చరాదు. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు మాత్రమే ఈ మీటర్లు అమర్చాలి” అని స్పష్టం చేశారు.
అలాగే, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లపై స్పష్టత ఇవ్వడానికి ముందు చెక్ మీటర్ల ద్వారా డెమోలు చూపించి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. “ప్రజల ఆమోదం లేనిదే ఏ విషయం మీద ముందుకు పోవద్దు” అంటూ అధికారులకు సూచనలు చేశారు.
విద్యుత్ సరఫరా పరిస్థితిపై కూడా సమీక్ష నిర్వహించిన మంత్రి, ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో వ్యవసాయానికి రోజూ 9 గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నామని అధికారుల నుంచి వివరాలు అందుకున్నారు. ప్రత్యేకంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లో వోల్టేజ్ సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.
ఆర్డీఎస్ఎస్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ పృథ్వీ తేజను మంత్రి కోరారు. అవసరమైతే స్థానిక కాంట్రాక్టర్ల సహాయం తీసుకోవాలన్నారు. “తొలిదశ పూర్తయ్యాక మాత్రమే రెండో దశ నిధులకు ప్రతిపాదనలు పంపవచ్చు” అని స్పష్టం చేశారు.
ఇదే విధంగా పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 కనెక్షన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.