Gottipati ravikumar : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డేనని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి విమర్శించారు.
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “వాళ్లే ఛార్జీలు పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, మళ్లీ వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది,” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోదని గొట్టిపాటి స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైంది కాదని దుయ్యబట్టారు.
వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని మంత్రి ఆరోపించారు. రైతులకు పగటిపూట నిరంతర విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.