Gold rate: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్థుతుల నేపధ్యం లో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న కారణంగా, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి, దాని వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనితో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు రూ. 6 వేలకు పైగా పెరిగి రూ. 96,000 ను దాటాయి.
ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 6,250 పెరిగి రూ. 96,450 కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సాయంత్రం బంగారం ధర రూ. 96,430 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 3,223 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వాణిజ్య యుద్ధాల ప్రభావం వల్ల, పది రోజుల క్రితం ఔన్సు బంగారం ధర 3,200 డాలర్లను తాకింది. తరువాత లాభాల స్వీకరణ కారణంగా కొంత తగ్గింది.
అయితే, ఇతర దేశాలపై టారిఫ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా మీద మాత్రం కొనసాగించారు. దీంతో, అమెరికాపై చైనా 125 శాతం టారిఫ్ విధించింది. ఈ టారిఫ్ యుద్ధం పసిడి ధరలపై ప్రభావం చూపుతోంది.
