Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో ధరలు గణనీయంగా పడిపోవడంతో కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది.
ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కేవలం నాలుగు గంటల్లోనే రూ.810 తగ్గింది. ఉదయం రూ.1,48,080గా ఉన్న ధర ప్రస్తుతం రూ.1,47,280కి చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై రూ.740 తగ్గి, ప్రస్తుతం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడతో పాటు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,150గా నమోదైంది. చెన్నైలో మాత్రం తులం బంగారం ధర కొంచెం ఎక్కువగా రూ.1,48,370 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చే మార్పులు, యుద్ధ వాతావరణం కొంత సడలడం వల్లే ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే, బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి మాత్రం నేడు స్థిరంగానే ఉంది. ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా మునుపటి రేట్లే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది. అయితే మన హైదరాబాద్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద విక్రయించబడుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్వల్ప ధరల తగ్గుదల సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశం.
