Gold Price Today: పసిడి ప్రేమికులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం మరియు భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాల ప్రభావం నేరుగా బంగారం ధరలపై పడుతోంది. బడ్జెట్ ప్రకటన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చిన ధరలు, ఇప్పుడు ఆల్టైమ్ రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. బుధవారం ఏకంగా భారీగా పెరిగిన ధరలు, గురువారం కూడా అదే బాటలో సాగుతుండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ధరలు ఒకేలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,59,450 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.1,46,160 కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, గత కొన్ని రోజులుగా చూస్తే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,600 గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,62,570 పలుకుతోంది.
కేవలం బంగారమే కాదు, వెండి కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతోంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న వెండి ధర ఇప్పుడు లక్షల్లోకి చేరిపోయింది. హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి ధర రూ.3,20,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే వంద రూపాయల వ్యత్యాసం కనిపిస్తున్నా, మొత్తంగా చూస్తే వెండి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ధరలు ఇలా పెరగడం మధ్యతరగతి ప్రజలకు పెద్ద భారంగా మారుతోంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
