Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకు మంచి సమయం అనే చెప్పాలి. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ విడుదలైనప్పటి నుండి మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని ఆర్థిక మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయాల ప్రభావం మన దేశీ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 3వ తేదీన కూడా ధరలు స్వల్పంగా తగ్గి, కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి.
హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,170 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,390 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ధరలు క్రమంగా దిగి వస్తుండటంతో సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,310 వద్ద ఉండగా, చెన్నైలో మాత్రం మిగిలిన నగరాల కంటే తక్కువగా రూ.1,52,170 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో కూడా 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతోంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలోనూ ధరలు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గి స్థిరంగా ఉన్నాయి. డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టిన వారు ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తుంటే, పెళ్లిళ్ల సీజన్ కోసం నగలు చేయించుకునే వారు మాత్రం ఈ తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటి వరకు రూ.3 లక్షల మార్కు వద్ద ఉన్న వెండి, ఈరోజు స్వల్పంగా దిగివచ్చింది. అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి కొనసాగితే ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
