Hyderabad

Hyderabad: రాజేంద్రనగర్ లో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు… భయంతో వణికిపోతున్న స్థానికులు!

Hyderabad: రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. వీళ్ల అల్లరితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా, పార్క్ చేసి ఉన్న ఒక కారు అద్దాలను పగలగొట్టి ఈ పోకిరి గ్యాంగ్ వీరంగం సృష్టించింది.

కారు పగలగొట్టి, యజమానిని బెదిరించి…
తన కారు అద్దాలు ఎందుకు పగలగొట్టారని అడిగిన యజమానిపైనే ఈ గంజాయి బ్యాచ్ దబాయించింది. “నాకు పగలగొట్టాలనిపించింది, అందుకే పగలగొట్టాను. ఎక్కువ మాట్లాడితే కారు మొత్తం తగలబెడతాను” అంటూ సదరు యజమానిని ఉల్టా బెదిరించారు. అంతేకాదు, అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై కూడా దాడులకు పాల్పడుతూ హల్‌చల్ చేశారు. వారి దురుసు ప్రవర్తనతో కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు.

పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో నుండి వింత సమాధానం వచ్చింది. “మీరు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తేనే వస్తాము” అని చెప్పడంపై ఎర్రబొడ కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రక్షణ కోసం నిలబడాల్సిన పోలీసులే ఇలా మాట్లాడడం బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ ఘటనపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు కొంతమంది రాజకీయ నాయకులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుడి మెట్లపైనే మందు… మహిళలకూ వేధింపులు
ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు కొత్తేమీ కాదు. ఎర్రబొడలోని బీరప్ప గుడి మెట్లపైనే కూర్చుని మద్యం సేవించడం, అక్కడే బీర్ బాటిళ్లు పడేయడం వీరికి మామూలైపోయింది. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు ఈ ప్రాంతంలో అల్లరి చేస్తూ, ముఖ్యంగా మహిళలు, యువతులపై వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశారని తెలుస్తోంది.

పోకిరి గ్యాంగ్ బరితెగింపు ఇలా కొనసాగుతుంటే తమ కాలనీలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయని ఎర్రబొడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి, గంజాయి గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *