గాజాలో ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్- హమాస్ల మధ్య భీకరపోరు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల నెలకొరుగుతున్నారు.గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరాత్రే గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
మరోవైపు ఉత్తర గాజాలో తీవ్రమైన ఆహారం, ఇంధనం, వైద్య సామాగ్రి కొరతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో కరువు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఉత్తరగాజాలో వచ్చే వారం ప్రారంభం కానున్న పోలియో టీకా క్యాంపెయిన్ ప్రభావితం కానున్నట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడులు జరుపుతుండటంతో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితమనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని తెలిపింది.
ఇకపోతే, గాజాలో సురక్షిత ప్రాంతాలు లేవని ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా చెబుతున్నారు. సెంట్రల్ గాజా స్ట్రిప్ ప్రాంతాల్లో సోమవారం నుండి పోలియో క్యాంపెయిన్ ప్రారంభం అవుతుందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.