CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తన జిల్లాల పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, మరోవైపు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పలు కీలక సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధానంగా కొరాట-చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు, సదర్మాట్ బ్యారేజీని కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అనంతరం నిర్మల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనధికారికంగా శంఖారావం పూరించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాపై తనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ, గతంలో ఇచ్చిన హామీల అమలుపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు.
Also Read: Teenmar mallana: ఐఏఎస్ మంత్రి లింకు కథ వెనుక బీఆర్ఎస్ ఉంది
ముఖ్యమంత్రి పర్యటన కేవలం ఆదిలాబాద్కే పరిమితం కాకుండా రాబోయే మూడు రోజుల పాటు వరుసగా కొనసాగనుంది. రేపు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, ఆ తర్వాతి రోజు ఖమ్మం, వరంగల్ జిల్లాలను సందర్శిస్తారు. ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి పనుల సమీక్షతో పాటు స్థానిక నేతలతో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా, రిజర్వేషన్లను ఖరారు చేసిన తరుణంలో, సీఎం పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడిని పుట్టిస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ జిల్లాల యాత్రను కొనసాగిస్తున్నారు.
