YS Jagan: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారాన్ని కోల్పోయిన తర్వాత, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు క్రమంగా కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ మంత్రులు కూటమి పార్టీలలో చేరగా, మరికొందరు చర్చలు జరుపుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు) పేరు కూడా వినిపిస్తోంది.
వైసీపీలో సైలెంట్ అవంతి
గతంలో టీడీపీలో ఎంపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అవంతి శ్రీనివాస్, అనంతరం వైసీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పాత రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఎక్కడా వైసీపీ తరఫున బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం ఆయన వైఖరిపై సందేహాలు రేకెత్తిస్తోంది. విశాఖ సమీపంలోని కొత్త నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వడంతో, అవంతి తిరిగి టీడీపీలోకి రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Google: గూగుల్ సంచలన నిర్ణయం.. 11 వేల యూట్యూబ్ ఛానళ్లు తొలగింపు
టీడీపీలోకి తిరిగి రావడంపై చర్చ
ఒకప్పుడు టీడీపీలోనే గంటా శ్రీనివాస్ తో కలిసి పనిచేసిన అవంతి, విభేదాల కారణంగా వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు అదే గంటా చేతిలో ఓడిపోయి, తిరిగి కూటమిలో భవిష్యత్తు వెతుక్కుంటున్నారని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా కూటమి పార్టీలపై విమర్శలు చేయకపోవడం కూడా ఆయన తిరిగి రావడానికి సంకేతంగా భావిస్తున్నారు.
విశాఖ రాజకీయాలపై ప్రభావం
అవంతి టీడీపీలోకి తిరిగి వస్తే, విశాఖ ప్రాంతంలో పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వైసీపీకి ఇది రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామంగా మారవచ్చు. అయితే టీడీపీలోనే అసంతృప్తిగా ఉన్న గంటా శ్రీనివాస్ ఈ పరిణామాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

