Dilip Ghosh: పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ శుక్రవారం సాయంత్రం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పార్టీకి చెందిన రింకు మజుందార్ను సంప్రదాయ బెంగాలీ పద్దతిలో, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక దిలీప్ ఘోష్ న్యూటౌన్ నివాసంలో జరిగింది.
వివాహం సందర్భంగా దిలీప్ ఘోష్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా, వధువు రింకు ఎరుపు రంగు చీరలో ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, రాజ్యసభ సభ్యుడు షమిక్ భట్టాచార్య, కేంద్ర స్థాయి నాయకులు సునీల్ బన్సాల్, మంగళ్ పాండే, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తదితరులు ఘోష్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Vijayasaireddy: అవమానాలతోనే వైసీపీని వదిలేశాను
వివాహం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడిస్తూ, “తల్లి కోరిక మేరకు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను,” అని 60 ఏళ్ల దిలీప్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “ఇది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. రాజకీయాల్లో నా కార్యకలాపాలకు ఇది ఎలాంటి అంతరాయం కలిగించదు,” అని స్పష్టం చేశారు.
రింకు మజుందార్కు ఇది రెండో వివాహం కాగా, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. దిలీప్ ఘోష్ ఇప్పటివరకు బ్రహ్మచారిగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా మార్నింగ్ వాక్లలో వీరిద్దరి పరిచయం పెరిగి, సమాన ఆలోచనలు కలవడంతో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లు సన్నిహితులు వెల్లడించారు.
దిలీప్ ఘోష్ చిన్ననాటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. 2015లో బీజేపీలో చేరిన తర్వాత పార్టీకి ముఖ్య నాయకుడిగా ఎదిగి, బెంగాల్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

