ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు జట్టులో కీలక మార్పులు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). టాప్ ఆటగాళ్లపై వేటు వేసింది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ అజమ్తో పాటు షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇంగ్లాండ్తో మిగిలిన రెండు టెస్ట్ల కోసం తాజాగా ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలు టార్గెట్ షహీన్ అఫ్రిది అని ఆరోపించాడు.
‘ముల్తాన్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉండేలా వారికి నచ్చినట్టు ఏర్పాటు చేశారు. బాబర్ ఫామ్లో లేడు కాబట్టి అలాంటి పిచ్లో కూడా ఔట్ అయ్యాడు.. అది అతడి దురదృష్టం. కానీ ప్రతిసారి మేనేజ్మెంట్ టార్గెట్ చేసేది మాత్రం షహీన్ అఫ్రిదినే. అయితే ఈ సందర్భంగా షహీన్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించాలి. నవ్వుతూ మాట్లాడే వాళ్లందరూ మనవాళ్లు అవ్వరు’ అంటూ చెప్పుకొచ్చాడు బాసిత్. బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, నసీం షా.. ఈ ముగ్గురూ జట్టులోనే ఉండాలన్నాడు . ‘బాబర్ అజామ్ అభిమానులు ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. మీరు ఇప్పుడు బయటికి వచ్చి వారికి మద్దతుగా నిలవండి. మేనేజ్మెంట్ తప్పు చేసింది.. దాని గురించి ప్రశ్నించండి. దేశవాళీ మ్యాచ్లు లేనప్పుడు ఆ ముగ్గురికి విశ్రాంతి ఇవ్వడంలో అర్థం లేదు’ అంటూ పిలుపునిచ్చాడు.