Marri Janardhan Reddy: నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ పోలీసుల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టం”
అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులందరి పేర్లను రాసి పెట్టుకుంటున్నామని హెచ్చరించారు. “కందనూలు ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీ పేరు రాసి పెట్టుకుంటున్నాం. మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం, వాళ్లు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా” అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read: Bhupalpally: కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులకు అస్వస్థత
పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిసలు: మర్రి జనార్దన్ రెడ్డి
పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బానిసలుగా మారిపోయారని మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా, పోలీసులు వెంటనే ఆ పోస్ట్ పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి వేధిస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు న్యాయం వైపు నిలబడాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ భవిష్యత్తుపై జోస్యం
ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై కూడా వ్యాఖ్యానించారు. రాబోయే 20 ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, అధికారంలోకి రావడం వారికి కేవలం ఒక కల మాత్రమేనని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతల మాటలు విని పోలీసులు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవద్దని ఆయన వారికి హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, అధికారులు ఆ హక్కును గౌరవించాలని ఆయన సూచించారు.
