Crime News: తమిళనాడు, నమక్కల్ జిల్లాలో అప్పుల బాధతో ఒక తండ్రి తన ముగ్గురు పసిబిడ్డలను చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాసిపురంలో నివాసం ఉంటున్న 36 ఏళ్ల గోవిందరాజ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిడితో ఆయన ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గోవిందరాజ్ తన ఇంటి నిర్మాణానికి భారీగా రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులు తీర్చలేక ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, ఆయన తన ముగ్గురు కుమార్తెలు – 3 ఏళ్ల దేవ శ్రీ, 7 ఏళ్ల రితిక శ్రీ, 9 ఏళ్ల ప్రతీష శ్రీలను గొంతు కోసి చంపారు. ఆ తరువాత, ఆయన కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం, మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుల బాధ ఒక కుటుంబంలో ఇంతటి విషాదాన్ని నింపడం ప్రజలను కలచివేసింది.