B R Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు వైకుంఠ ద్వార దర్శనాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఈసారి శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు అంటే మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది.
మొదటి మూడు రోజులకు గాను, భక్తులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లను కేటాయించారు. అయితే, మిగిలిన ఏడు రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకుండానే సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఛైర్మన్ వివరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాల పర్యవేక్షణ నిరంతరంగా ఉంటుందని తెలిపారు.
అంతేకాకుండా, తితిదే ధర్మకర్తల మండలి కొన్ని ముఖ్యమైన పనులపైనా దృష్టి సారించింది. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పీఏసీలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం ఆయన ఇటీవల రూ.9 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం తితిదే పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 50 అంశాలపై చర్చిస్తారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆలయ ధ్వజస్తంభాల కోసం అవసరమయ్యే దివ్య వృక్షాలను తితిదే స్వయంగా పెంచాలని నిర్ణయించింది. దీనికోసం పలమనేరులోని తితిదే గోశాల ప్రాంగణంలో 100 ఎకరాల స్థలాన్ని అనువుగా గుర్తించారు. ఈ ‘దివ్య వృక్షాల పెంపకం’ ప్రాజెక్టు గురించి పాలక మండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
