Etala Rajendar: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం కేంద్ర ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ అందిస్తోందని స్పష్టం చేశారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీ విద్యార్థులకు వందశాతం రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చినా, పాత విధానంలో కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా, పాత బకాయిలు చెల్లించే బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు.
తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యతలేని ప్రభుత్వాన్ని చూడలేదని ఈటల రాజేందర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను ముందస్తుగా నిల్వచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని, కేంద్రంపై నెపం మోపకుండా ఎరువులు సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.