Eagle Team: తెలంగాణలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన EAGLE టీమ్ (ఈగల్ టీమ్) సంచలన విజయం సాధించింది. డ్రగ్స్ వ్యాపారంలో నైజీరియా ముఠాకు సంబంధించిన డబ్బు బదిలీ నెట్వర్క్ను (హవాలా) ఈ బృందం బద్దలు కొట్టింది.
ముంబైలో ఆపరేషన్: 3 కోట్లు పట్టివేత
ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో ముంబైలో మెరుపు దాడి చేసింది. డ్రగ్స్ దందాకు సంబంధించిన భారీ మొత్తంలో హవాలా డబ్బును స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు విలువ అక్షరాల మూడు కోట్ల రూపాయలు (3 కోట్లు) ఉంటుందని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ ముఠాలకు డబ్బులు బదిలీ చేస్తున్న దగ్గారం ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటివరకు 25 మంది అరెస్ట్, నకిలీ పాస్పోర్ట్లపై దర్యాప్తు
ఈ డ్రగ్స్ దందా కేసులో ఇప్పటివరకు మొత్తం 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, కొందరు విదేశీయులు నకిలీ పాస్పోర్ట్లతో (Fake Passports) మన దేశంలోకి వచ్చి ఈ దందాను నడిపిస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారంపై కూడా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
డ్రగ్స్ దందాలను అరికట్టేందుకు ఈగల్ టీమ్ ఆపరేషన్స్ మరింత ముమ్మరం చేస్తామని అధికారులు తెలిపారు.