Hyderabad: మద్యం ప్రియులు రోజుకింత పెరిగిపోతున్నారు. మద్యపానం హానికరం అని చెప్పిన వినకుండా తాగుతూ.. ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నారు. ఇది ఒకలెక్క అయితే మద్యం తాగి బండి నడపడం ఇంకో ఫ్యాషన్.. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, జైలుకు పంపిస్తామని హెచ్చరించినా కొందరిలో ఏమాత్రం మార్పు రావట్లేదు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏకంగా 513 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఇందులో 425 మంది బైకర్లు, 24 మంది ఆటో డ్రైవర్లు, 60 మంది కారు డ్రైవర్లు, నలుగురు లారీ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 64 మందికి బ్లడ్ ఆల్కహాల్కాన్సెంట్రేషన్(బీఏసీ) 200/100 ఎంజీనుంచి 500/100 ఎంజీ వచ్చింది. వీరందరిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేసిన రాచకొండ పోలీసులు.. ఓఆర్ఆర్ పై జరుగుతున్న ప్రమాదాలలో నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లే పలు ప్రమాదాలకు కారణంగా నిర్ధారించుకున్నారు. దీంతో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో ఓఆర్ఆర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు.
ఇప్పటికే ఆక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం లను ఏర్పాటు చేశారు. పోలీసులు, అధికారులు రోడ్లమీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్లు కమిషనర్ సుధీర్ బాబు తాజాగా వెల్లడించారు. ఇదే కాకుండా ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు 100 బాడీ వార్న్ కెమెరాలను కొనుగోలు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.