Dhulipalla Narendra: సంగం డెయిరీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే, డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తనను 33 రోజులు జైల్లో పెట్టి, డెయిరీని అణువణువూ జల్లెడ పట్టినా ఒక్క తప్పు కూడా దొరకలేదని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నుండి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు ఇతరులపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వంపై ధూళిపాళ్ళ ప్రశ్నల వర్షం
గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని ధూళిపాళ్ళ ఎండగట్టారు. సాక్షి పేపర్, ఛానల్కు రూ. 307 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్న ఘనత వారిదేనని ఎద్దేవా చేశారు.
- సిమెంట్ దందా: భారతీ సిమెంట్స్ నుండి కాంట్రాక్టర్ల ద్వారా 3 లక్షల టన్నుల సిమెంట్ను అమ్ముకున్నారని ఆరోపించారు.
- తప్పుడు కేసులు: తనపై ఇప్పటికీ 22 తప్పుడు కేసులు ఉన్నాయని, ప్రభుత్వం తనకు సహకరిస్తే ఆ కేసులు ఎప్పుడో పోయేవి కదా అని ప్రశ్నించారు. ఫేక్ బతుకులకు, వెబ్సైట్లు డౌన్ చేయడాలకు వైసీపీయే పేటెంట్ హక్కుదారు అని ఘాటుగా విమర్శించారు.
తిరుమల లడ్డూ కల్తీపై సంచలన నిజాలు
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేది వాస్తవమని, ఎన్డీడీబీ (NDDB) నివేదిక కూడా అదే చెప్పిందని ధూళిపాళ్ళ పునరుద్ఘాటించారు.
- ధరల వ్యత్యాసం: మార్కెట్లో బటర్ ధర రూ. 360 ఉంటే, కేవలం రూ. 316కే నెయ్యి ఎలా సరఫరా చేశారని ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండానే నెయ్యి తయారు చేసిన మహా ఘనులు వైసీపీ నాయకులని చలోక్తులు విసిరారు.
- అవినీతి సొమ్ము: కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకు రూ. 12.5 కోట్లు, చెన్నైకి రూ. 7.5 కోట్లు వెళ్లాయని సిట్ (SIT) నిర్ధారించిందని తెలిపారు.
సంగం డెయిరీ నాణ్యతకు నిదర్శనం
సంగం డెయిరీ 2020 నుండే టీటీడీ టెండర్ల కోసం ప్రయత్నిస్తోందని, నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలు పాసయ్యాకే ఇప్పుడు అవకాశం దక్కిందని ఆయన వివరించారు.
- టీటీడీ సేవ: చంద్రబాబు చెపితే టెండర్ రాలేదని, సాంకేతిక పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేస్తున్నామని చెప్పారు.
- హెరిటేజ్ ప్రస్తావన: హెరిటేజ్ సంస్థ ఒక్క పూస నెయ్యి కూడా టీటీడీకి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అంతటి నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని ఆయన సవాల్ విసిరారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసిన వారు మట్టిలో కలిసిపోవడం ఖాయమని ధూళిపాళ్ళ హెచ్చరించారు.
